న్యూఢిల్లీ: యూరప్ దేశాలకు వెళ్ళాలనుకునే భారతదేశ విద్యార్థులు మరియు ప్రయాణికులకు శుభవార్త. గ్రీన్ పాసులు జారీ చేసే విషయంలో యూరోపియన్ దేశాలకు భారత్కు మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం విదితమే. అయితే తాజాగా ఈ నేపథ్యంలో భారత్ విజయం సాధించింది. ఈయూలో సభ్యత్వం ఉన్న ఏడు దేశాలు భారతీయ ప్రయాణికులకు ఊరటనిచ్చాయి. ఆ దేశాల అప్రూవ్డ్ వ్యాక్సిన్ల లిస్ట్లో కొవిషీల్డ్ పేరును కూడా చేర్చినట్లు ఉన్నఫలంగా ప్రకటించాయి.
ఈయూ దేశాలైన స్విట్జర్లాండ్తో పాటు జర్మనీ, స్లోవేనియా, ఆస్ట్రియా, గ్రీస్, ఐల్యాండ్, ఐర్లాండ్, స్పెయిన్, దేశాలు కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను అంగీకరించాయి. అందువల్ల ఆయా దేశాలకు వెళ్లే కొవిషీల్డ్ తీసుకున్న భారత ప్రయాణికులకు ఇకపై మార్గం సుగమం అవనుంది. కాగా, తమ వ్యాక్సిన్ల(కొవాగ్జిన్, కొవిషీల్డ్) డిజిటల్ సర్టిఫికేట్ అనుమతించకపోతే, ఈయూ దేశాల ప్రయాణికుల సర్టిఫికేట్లను ఒప్పుకోమని, పైగా కఠిన క్వారంటైన్ నిబంధనలను అమలు చేస్తామని భారత్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో ఈయూ లోని ఎనిమిది దేశాలు కొవిషీల్డ్కు అనుమతి ఇచ్చాయి. తాజా పరిణామాలతో ఈయూ ఏజెన్సీ (27 దేశాల సమాఖ్య) లోని మిగతా దేశాలు కూడా ఈ విషయంపై త్వరగతిన స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈయూ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు జులై ఒకటి నుంచి గ్రీన్ పాస్ తప్పనిసరి చేశారు.
ఈ గ్రీన్ పాస్ ను ఈయూ డిజిటల్ కొవిడ్ సర్టిఫికేట్ అని కూడా అంటారు. దీనిని కలిగిన వారికి ఇమ్యూనిటీ డాక్యుమెంట్గా భావిస్తారు. ఇది ఉన్నవాళ్లకు (అంటే వ్యాక్సిన్ యొక్క రెండు డోసులు తీసుకున్న వాళ్లు) ఆయా దేశాలలో తప్పనిసరి అయిన క్వారంటైన్ నుంచి మినహాయింపు పొందుతారు.