లక్నో: దేశంలో కరోనా మహమ్మారి ఇంకా తన విలయాన్ని కొనసాగిస్తోంది. సకాలంలో వైద్యం, ఆక్సిజన్, బెడ్లు దొరకక చాలా మంది కోవిడ్ బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. యూపీ లోని ఉన్నావ్ జిల్లాలో ఒక దిగ్భ్రాంతి కరమైన సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.
జిల్లాలోని ప్రాథమిక, సమాజ ఆరోగ్య కేంద్రాల ఇన్చార్జ్లుగా పనిచేస్తున్న సుమారు 16 మంది సీనియర్ వైద్యులు బుధవారం సాయంత్రం సామూహిక రాజీనామా చేశారు. తమకు తమ ఉన్నతాధికారుల నుంచి సహకారం లేకపోగా, వారి ద్వారా వేధింపులకు గురవుతున్నామని సదరు డాక్టర్లు ఆరోపించారు.
ఆరోగ్య కేంద్రాల ఇన్చార్జులగా ఉన్న 11 మంది వైద్యులు, జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ఐదుగురు వైద్యులు మొత్తం ఉన్నావ్ ప్రధాన వైద్య అధికారి డాక్టర్ అశుతోష్ కుమార్కు వారి సామూహిక రాజీనామాను సమర్పించారు.
అదే విధంగా డిప్యూటీ సిఎంఓ డాక్టర్ తన్మయ్ కు వారు మెమోరాండం అందించారు. కోవిడ్-19 మహమ్మారిని నియంత్రించడానికి తామంతా చాలా అంకితభావంతో పూర్తి నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ, పై అధికారులు వేధింపులకు గురిచేస్తూ నియంతృత్వ వైఖరితో ఉన్నారని, అక్రమంగా తమపై చర్యలకు ఉత్తర్వులిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎటువంటి వివరణ మరియు చర్చలు ఏవీ లేకుండానే జరిమానా చర్యలు తీసుకుంటున్నారని వైద్యులు ఆరోపించారు. మరోవైపు మూకుమ్మడి రాజీనామాల విషయం తనకు తెలియదని డాక్టర్ అశుతోష్ కుమార్ చెప్పారు. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, జిల్లా మేజిస్ట్రేట్తో చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అన్నారు.