ముంబై: మహారాష్ట్రలో పెరుగుతున్న డెల్లా ప్లస్ వేరియంట్ కేసులు, అలాగే థర్డ్వేవ్తో పిల్లలకు ప్రమాదం పొంచి ఉంది అన్న భయాల నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కాస్త ధైర్యం కలిగించే వార్త తెలిపింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిర్వహించిన సీరో సర్వేలో 51 శాతానికి పైగా పిల్లల్లో కోవిడ్ యాంటీ బాడీలు ఉన్నట్లు తేలిందని ప్రకటించింది.
ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి జూన్ 15 వరకు దాదాపు 2176 రక్త నమూనాలు పరీక్షించగా ఒకటి నుంచి నాలుగేళ్ల వయసు గల పిల్లల్లో 51.04 శాతం మరియు 5-9 వయస్కుల్లో 47.55 శాతం, అలాగే 10 నుంచి 14 ఏళ్ల చిన్నారుల్లో అత్యధికంగా 53.43 శాతం మందికి, 15-18 ఏజ్ గ్రూప్లో 51.39 శాతం మందిలో వైరస్ నుండి కాపాడే ప్రతిరక్షకాలు ఉన్నట్లు తెలిపింది. మొత్తంగా 1- 18 ఏళ్ల వయసు గల పిల్లల్లో సెరో పాజిటివిటీ రేటు 51.18 శాతం ఉన్నట్లు బీఎంసీ నివేదిక పేర్కొంది.
కాగా ఈ సంవత్సరం మార్చిలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే, సేరో పాజిటివిటీ రేటులో భారీ పెరుగుదల నమోదైనట్లు తెలిపింది. 18 కంటే తక్కువ వయస్సున్న పిల్లల్లో సెరో పాజిటివిటీ 39.4 శాతం ఉన్నట్లు గత సర్వేలో తేలింది. సెకండ్ వేవ్లో పిల్లలు చాలా మంది కోవిడ్ బారిన పడ్డారు. వారిలో ప్రతిరక్షకాలు పెరిగాయి, అని బీఎంసీ పేర్కొంది. కాగా డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయంటూ భయాలు నెలకొన్న తరుణంలో ఇది శుభవార్తే.
ఈ విషయంపై స్పందించిన ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్దీప్ గులేరియా తొలి, రెండో దశలో పిల్లలకు కరోనా సోకినా పెద్దగా ప్రమాదం జరుగలేదని కేవలం చిన్నపాటి ఇన్ఫెక్షన్ మాత్రమే సోకిందని, కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం తప్పుతుందని పేర్కొన్నారు. ఇక అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ సైతం, థర్డ్వేవ్లో పిల్లలు తీవ్ర లక్షణాలతో బాధపడతారనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. 90 శాతం మంది స్వల్ప లక్షణాలతో బయటపడతారు అని ఓ ప్రకటన విడుదల చేసింది.