fbpx
Sunday, October 27, 2024
HomeAndhra Pradeshతాడిపత్రిలో 500 పడకల కోవిడ్‌ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం

తాడిపత్రిలో 500 పడకల కోవిడ్‌ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం

500BEDS-COVID-HOSPITAL-LAUNCHED-IN-TADIPATRI

అమరావతి: అనంతపురం జిల్లా లోని తాడిపత్రిలో 500 పడకల కోవిడ్‌ ప్రత్యేక ఆసుపత్రిని ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్ పద్దతిలో ఘనంగా ప్రారంభించారు. ఏపీలోనే తొలిసారిగా అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణ సమీపంలోని ఆర్జాస్‌ స్టీల్‌ వద్ద 500 ఆక్సిజన్‌ పడకలు జర్మన్‌ హ్యాంగర్ల ఆస్పత్రిని నిర్మించారు.

కేవలం 15 రోజుల్లోనే 13.56 ఎకరాల్లో రూ.5.50 కోట్ల ఖర్చుతో ఈ కోవిడ్‌ ఆస్పత్రిని నిర్మించారు. ప్రారంభ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ‘‘ కోవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో, ఆక్సిజన్‌ కెపాసిటీలు కొంచెం కష్టంగా ఉన్న సమయంలో అర్జాస్‌ స్టీల్‌కు ఎయిర్‌ సపరేషన్‌ ప్లాంట్‌ ఉండటం, అక్కడి నుంచి వారి ప్లాంట్‌ కెపాసిటీ మేరకు దాదాపు రోజుకు 100 టన్నుల లిక్విడ్‌ ఆక్సీజన్‌ కెపాసిటీ ఉండడం, వారిని ఉపయోగించుకుని జర్మన్‌ హ్యంగర్‌లతో ఈ ఆసుపత్రిని ఏర్పాటుచేయడం నిజంగా చాళా గర్వించదగినది.

ఈ ఆసుపత్రి నిర్మాణంలో బాగం అయిన అందరూ చాలా బాగా పనిచేశారు. దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అందరికీ అభినందనలు. అర్జాస్‌ స్టీల్స్‌ ఎండీ శ్రీధర్‌ కృష్ణమూర్తికి ప్రత్యేక అభినందనలు. ఈ కష్టకాలంలో మీరు చేసిన సాయం మరువలేనిది’’ అని అన్నారు. ఇదే సందర్భంలో అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడిని కూడా సీఎం అభినందించారు.

ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు ఇతర ఉన్నతాధికారులు హాజరుకాగా తాడిపత్రి నుంచి రోడ్లు, భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్ధానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular