అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల్లో కరోనా కేసులపై ఏపి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సోమవారం ఆరా తీశారు. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల అధికారులతో మంత్రి మాట్లాడారు. కరోనా బాధితులకు వైద్య సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు.
ఇటీవల తెనాలిలో మున్సిపల్ సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడంతో వారందరినీ హోం క్వారంటైన్లో ఉంచామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ఉన్న వారికి తెనాలి ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా పరీక్షలు చేయిస్తున్నామని అన్నారు. పొన్నూరులోని ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులకు ర్యాండమ్గా కరోనా పరీక్షలు చేయాలని కూడా ఆయన వైద్యాధికారులను ఆదేశించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడొద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కృష్ణా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆయన వైద్య బృందాలు అప్రమత్తం చేశారు. సర్వే బృందాలను ఇంటింటికి పంపించి వివరాలు సేకరించాలన్నారు. జగ్గయ్యపేట ప్రాంతంలో కరోనా బాధితులను హోమ్ క్వారంటైన్కు తరలించామని, బాధితులు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారన్నారు.
తూర్పుగోదావరి జిల్లా కొనసీమ ప్రాంతంలోని మలికిపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని, వారిని కూడా హోం క్వారంటైన్కు తరలించామని పేర్కొన్నారు. కొంతమంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినప్పటికీ, వారికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవన్నారు. కరోనా సోకిన బాధితులకు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో వైద్య సదుపాయం కల్పించామని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.