అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ని 17 పంచాయతీలను జారీయ అవార్డులు వరించాయి. దేశంలో అన్ని రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక పాలనా పరిస్థితుల’ ఆధారంగా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులలో ఈ ఏడాది ఏపీ ఏకంగా 17 అవార్డులను కైవసం చేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ పంచాయతీరాజ్ దినోత్సవం నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అవార్డుల పోటీలో దేశవ్యాప్తంగా 74 వేల గ్రామ పంచాయతీలు పోటీ పడ్డాయి.
కాగా దేశం మొత్తం మీద అధిక సంఖ్యలో అవార్డులు వచ్చిన నాలుగో రాష్ట్రంగా ఏపీ నిలిచింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఏపీకి 17 అవార్డులు వచ్చాయని, దేశంలో ఎక్కువ అవార్డులు వచ్చిన నాలుగో రాష్ట్రం ఏపీ అని ఆయన తెలిపారు.
రాష్ట్రానికి ఈ-గవర్నెన్స్ కింద అవార్డు వచ్చిందన్నారు. గాంధీ స్ఫూర్తితో సీఎం జగన్ స్థాపించిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు. గుంటూరు, కృష్ణా జిల్లా పరిషత్లకు అవార్డులు వచ్చాయని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.