హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి కంట్రోల్లోనే ఉందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి అదుపులోనే ఉందని పేర్కొన్నారు. కరోనాను కట్టడికి చేసే విషయంలో వైద్య సిబ్బంది అత్యంత నిబద్ధతో పని చేస్తున్నారని పొగిడారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా కట్టడి చర్యలపై దిశానిర్దేశం చేశారని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై బుధవారం సీఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశం తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక్కడ ఇతర రాష్ట్రాల వారే ఎక్కువమంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఆక్సిజన్ మరియు మందులకు కొరత లేదన్నారు.
రాష్ట్రంలో ఆక్సిజన్ బెడ్స్ పెంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం కోవిడ్ ఆస్పత్రుల్లో 62వేల బెడ్స్ ఉన్నాయని, తెలంగాణలో 135 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే ఉత్పత్తి అవుతుందన్నారు. ఒడిశా నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ నింపుకొని రావడానికి 6 రోజులు పడుతుంది.
ఎయిర్లిఫ్ట్ చేయడం వల్ల మూడు రోజుల సమయం ఆదా అవుతోంది. కరోనా కట్టడికి ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తామని సీఎం చెప్పారు. తెలంగాణలో 90వేల రెమిడెసివిర్ వయల్స్ అందుబాటులో ఉన్నాయి. టోసిలిజుమాబ్ 63 వయల్స్ స్టాక్ ఉంది. అనవసరంగా ఆక్సిజన్, రెమిడెసివిర్ మందుల్ని వృథా చేస్తున్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది అని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.