ముంబై: ఐపీఎల్ సజావుగా నిర్వహించడానికి బీసీసీఐ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆటగాళ్లను బయోబబుల్లో ఉంచినప్పటికీ కూడా కరోనా ప్రభావం మీద పడింది. అందువల్ల ఈ ప్రీమియర్ లీగ్ను అనూహ్యంగా మధ్యలోనే నిరవధికంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ అంశం పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రికెట్ బోర్డు ఈ సీజన్ లీగ్ను జరపాలని భావించిన సమయంలో దేశంలో కేసులు తక్కువ సంఖ్యలోనే ఉండడం, అప్పటికి దేశంలో పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు అనిపించింది. ఆ కారణంతోనే మ్యాచ్లను వివిధ నగరాల్లో నిర్వహించాలని నిర్ణయించాం. అయినప్పటికీ కరోనా పరీక్షల్లో నలుగురు ఆటగాళ్లకు పాజిటివ్ రావడంతో ఐపీఎల్ 14 వ ఎడిషన్ను నిరవధికంగా వాయిదా వేయాలని బోర్డు మంగళవారం నిర్ణయించింది, అని తెలిపారు.
ఐపీఏల్ లో ఆటగాళ్లకు పాజిటివ్ రావడంపై ఆయన స్పందిస్తూ, బయోబబుల్లో ఎటువంటి ఉల్లంఘన జరగలేదని మాకు అందిన నివేదిక ద్వారా అందింది. అయినా ఆటగాళ్లకు పాజిటివ్ ఎలా వచ్చిందో మాకు తెలియడం లేదు. బీసీసీఐ ఇంత పక్కాగా చర్యలు చేపట్టినా ఆటగాళ్లకు ఎలా వైరస్ సోకిందని చెప్పడం కూడా కష్టమే అని పేర్కొన్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్కు చెందిన అమిత్ మిశ్రా, సన్రైజర్స్ హైదరాబాద్కు చెందిన వృద్ధిమాన్ సాహాకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ తర్వాత ఈ సీజన్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. అహ్మదాబాద్లో మే 30 వరకు జరగాల్సిన 60 మ్యాచ్ల టోర్నమెంట్లో కేవలం 29 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. తాజాగా ఐపీఎల్ రద్దు కాలేదని, వాయిదా మాత్రమే వేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా దీనిపై మంగళవారం స్పష్టం చేశారు.