ఢిల్లీ: భారత దేశవాళీ ప్రముఖ కరోనా వ్యాక్సిన్ తయారీదారు అయిన భారత్ బయోటెక్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నేరుగా రాష్ట్రాలకు కొవాక్జిన్ టీకాలను పంపిణీ చేయడానికి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చేసిన కేటాయింపుల ప్రకారం ఈ పంపిణీని చేపట్టనుంది.
ఈ పాటికే కోవాక్జిన్ టీకాలను 14 రాష్ట్రాలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కంపెనీ మొదలు పెట్టిందని భారత్ బయోటెక్ కంపెనీ కో ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ సుచిత్ర ఎల్ల ట్విటర్ ద్వారా ప్రకటించారు. అలాగే టీకాల సరఫరా కోసం తమను నేరుగా సంప్రదించిన మిగిలిన రాష్ట్రాలకు కూడా టీకాల లభ్యతను బట్టి సరఫరా కూడా చేస్తామని తెలిపారు.
కొవాక్జిన్ టీకాను ప్రస్తుతం సరఫరా చేస్తోన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అసోం, ఛత్తీస్ఘడ్, ఒడిశా, ఢిల్లీ, గుజరాత్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి.
కంపెనీ తొలుత కొవాక్జిన్ టీకాలను రాష్ట్రాలకు ఒక్కొ డోసు ధరను రూ. 600గా నిర్ణయించింది, కానీ తరువాత నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాలకు ఒక్కొ డోసు ధర రూ. 400గా తగ్గించింది. కొవాక్జిన్ టీకాలను ప్రైవేటు ఆస్పత్రులకు ఒక్కొ డోసును రూ.1200 అందించనున్నారు. టీకాలను ఎగుమతి చేసుకునే దేశాలకు సుమారు 15-20 డాలర్లకు అందించనుంది.