న్యాపిడా: మయన్మార్ న్యాపిడా లో జరిగిన ఒక ఘోర విమాన ప్రమాదంలో ఓ ప్రముఖ బౌద్ధ సన్యాసితో పాటు మొత్తం 12 మంది మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వాతావరణం అనుకూలించక ఆ సైనిక విమానం కుప్పకూలినట్లు తెలుస్తోంది. న్యాపిడా నుంచి పైన్ ఓ ఎల్విన్ నగరానికి వెళ్తున్నప్పుడు ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
ఘటన వివరాలు: ఒక మఠం శంకుస్థాపన చేసేందుకు విమానం ఓ-ఎల్విన్ పట్టణానికి వెళ్తోంది. దేశ రాజధాని న్యాపిడా నుంచి గురువారం బయల్దేరిన కాసేపటికి ఈ విమానం కుప్పకూలింది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు మిలిటరీ సిబ్బందితో పాటు మరో ఇద్దరు బౌద్ధమత సన్యాసులు, ఆరుగురు భక్తులు కూడా ఉన్నారు. ప్రమాదంలో అందరూ తీవ్ర గాయాలపాలయ్యారు.
కాగా విమానంలో ఉన్న 12 మంది దుర్మరణం పాలయ్యారు. అందులో ఒక బాలుడు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనలో ఓ సైనికుడు ప్రాణాలతో బయటపడినట్టు సైనిక వర్గాలు తెలిపాయి. 400 మీటర్ల ఎత్తుకు ఎగిరిన అనంతరం వాతావరణం సహకరించక ఈ విమానానానికి సిగ్నల్స్ కూడా అందలేదు. దీంతో విమానం కుప్పకూలిపోయింది.