దుబాయ్: టీ20 ప్రపంచకప్ టోర్నీ నిర్వహించే ఖచ్చితమైన తేదీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం ట్విటర్ వేదికగా స్పష్టం చేసింది. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీలో మ్యాచ్లను యూఏఈలో ఒమన్లో నిర్వహించనున్నట్లు తమ అధికారిక ప్రకటనలో తెలిపింది.
భారత్లో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించిండం వల్ల ప్రపంచ కప్ టోర్నీ నిర్వహణ వేదికలను మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. బీసీసీఐ ఆతిథ్యంలోనే ఈ టోర్నీ మొత్తం జరుగనుందని ఐసీసీ స్పష్టం చేసింది. టోర్నీలో భాగంగా మొత్తం నాలుగు వేదికల్లో మ్యాచ్లు ఉంటాయి.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, ద షేక్ జాయెద్ స్టేడియం (అబుదాబి), షార్జా స్టేడియం, ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్లో మ్యాచ్లను నిర్వహించనున్నారు. కాగా టోర్నమెంట్ తొలి రౌండ్లో అర్హత సాధించిన 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోతాయి.
ఒమన్, యూఏఈ దేశాల్లో రెండు గ్రూపులు మ్యాచ్లు ఆడనున్నాయి. ఈ జట్ల నుంచి నాలుగు టీమ్లు సూపర్12కు ఎంపికవుతాయి. ఆ జట్లు 8 ఆటోమెటిక్ క్వాలిఫైయర్స్తో కలుస్తాయని ఐసీసీ తన ట్వీట్లో పేర్కొంది. కాగా టీ20 ప్రపంచకప్ వేదికలను భారత్ నుంచి యూఏఈకి తరలించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సోమవారం వెల్లడించిన సంగతి తెలిసిందే.