న్యూఢిల్లీ: భారత రాజధాని నగరం ఢిల్లీలో ఇవాళ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లోధిరోడ్లో ఉన్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బిల్డింగ్లోని, సీజీఓ కాంప్లెక్స్లో భారీ మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడ పని చేస్తున్న సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా వెంటనే 6 ఫైరింజన్లు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నాయి.
అయితే ఈ ప్రమాదం ఈ రోజు ఉదయం 11 గంటల తరువాత జరిగినట్లు భావిస్తున్నారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒక్క సారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దుమ్ము, ధూళి ఆవరించింది.
జరిగిన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే, పెద్ద ఎత్తున పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. అలాగే ఆ ప్రాంతంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు. కాగా, సీజీఓ కాంప్లెక్స్లోని సెకండ్ బేస్లోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు వ్యాపించి ఉండొచ్చని ప్రాథమిక సమాచారం.
అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఆఫీస్లో ఉన్న సీబీఐ ఆఫీస్ సిబ్బంది బయటకు పరుగులు పెట్టారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే, కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.