న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూని కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ ఖరారు చేసింది. పంజాబ్ కాంగ్రెస్లో సిద్ధూ మరియు ముఖ్యమంత్రి అమరీందర్ ల మధ్య నెలకొన్న విబేధాల నేపథ్యంలో పార్టీ చీఫ్ సోనియాగాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా రాబోయే ఏడాది పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా పీసీసీ చీఫ్గా సిద్దూని నియమించిన సోనియా, మరో నలుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించారు.
కాగా వివిధ సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని సంగత్ సింగ్ గిల్జియాన్, సుఖ్వీందర్ సింగ్ డానీ, పవన్ గోయెల్, కుల్జీత్ సింగ్ నాగ్రాలను రాష్ట్ర పంజాబ్ కాంగ్రెస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్న అమరీందర్, సిద్ధూ బహిరంగంగానే పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నూతన అధ్యక్షుడిగా తక్షణమే అమల్లోకి వచ్చేలా, సిద్ధూని నియమిస్తున్నాం అని కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఒక ప్రకటనలో ప్రకతించింది. కాగా ఇంతవరకు పీసీసీ చీఫ్గా ఉన్న సునీల్ జాఖడ్ సేవలను ఈ సందర్భంలో పార్టీ అధిష్టానం ప్రశంసించింది. 2017లో గత అసెంబ్లీ ఎన్నికల ముందు సిద్ధూ బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఆ తరువాత క్రమంగా, పార్టీలో సిద్ధూ మంచి పట్టు సాధించారు.
అమరిందర్ సింగ్తో మంచి సయోధ్య ఒకవేళ కుదరని పక్షంలో ఆయన వర్గీయుల వ్యతిరేకతను తట్టుకుని పార్టీని ఏకం చేయడం, పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎన్నికల కోసం సిద్ధం చేయడం నూతనంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ ముందున్న ప్రధాన సవాళ్లు.