హైదరాబాద్: తెలంగాణ డీఎస్సీ ఫలితాల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. 2024 డీఎస్సీ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో https://tgdsc.aptonline.in/tgdsc/ చూసుకోవచ్చు.
ఈ ఏడాది మార్చి 1న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 18 నుంచి ఆగస్ట్ 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించగా, 2.45 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 56 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసి రికార్డు సృష్టించింది. ఈసారి తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు.
పరీక్ష అనంతరం ఆగస్టు 13న ప్రిలిమినరీ కీ విడుదల చేసి, అభ్యంతరాలను ఆగస్టు 20 వరకు స్వీకరించారు. సెప్టెంబర్ 6న ఫైనల్ కీ విడుదల చేశారు.
ఫలితాల్లో కేవలం మార్కులు, ర్యాంకులు మాత్రమే ఉంటాయి. అభ్యర్థుల మెరిట్ జాబితాను రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో జిల్లాల వారీగా ప్రకటిస్తారని అధికారులు తెలిపారు. మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను జిల్లాల విద్యాధికారులకు (DEO) ఇవ్వనున్నారు.
మొత్తం పోస్టులు:
- 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు
- 727 భాషా పండితులు
- 182 పీఈటీలు
- 6,508 ఎస్జీటీలు
- 220 స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్లు
- 796 ఎస్జీటీ పోస్టులు
ఈ పోస్టులను అభ్యర్థుల మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా భర్తీ చేయనున్నారు.