అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పలుమార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఇతర కేంద్రమంత్రులతోనూ సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈసారి ఆయన పర్యటనలో మరికొన్ని కీలక అంశాలు చర్చకు రానుండటంతో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
సీఎం చంద్రబాబు ఈ నెల 7న ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్లతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించి అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్ వంటి కీలక అంశాలపై ప్రతిపాదనలు చేయనున్నారు.
అమరావతి రాజధాని ప్రాజెక్టుకు సంబంధించి ప్రపంచ బ్యాంక్తో ఇప్పటికే కేంద్రం గ్యారంటీతో రూ. 15 వేల కోట్ల రుణం తీసుకునేందుకు అంగీకారం లభించింది. ఈ ఫండింగ్పై తదుపరి చర్యల గురించి ప్రధానమంత్రి మోడీ, అమిత్ షాతో చంద్రబాబు చర్చించే అవకాశాలున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, రాష్ట్రానికి రానున్న నిధులపై కూడా ప్రధానంగా చర్చ జరుగనుంది.
అంతేకాక, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన శంకుస్థాపన తేదీపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఇతర రైల్వే ప్రాజెక్టుల పురోగతిని కూడా చర్చించనున్నారు. ప్రత్యేకించి, రాయలసీమ ప్రాంతంలో ప్రాధాన్యం సంతరించుకున్న కొన్ని ప్రాజెక్టులపై మంత్రులతో భేటీ జరుగనుంది.
ఈ పర్యటనలో ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ నిధుల విడుదల, విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన వంటి అంశాలపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. చంద్రబాబుకు ఈ పర్యటన రాష్ట్రం అభివృద్ధి దిశగా మరిన్ని ప్రయోజనాలు తీసుకొస్తుందని ఆశిస్తున్నారు.