fbpx
Monday, October 21, 2024
HomeAndhra Pradesh"బాబాయ్‌ని చంపి పచ్చి నెత్తురు తాగిన రాక్షసుడు జగన్" - లోకేష్

“బాబాయ్‌ని చంపి పచ్చి నెత్తురు తాగిన రాక్షసుడు జగన్” – లోకేష్

minister Nara Lokesh’s sensational allegations

ఆంధ్రప్రదేశ్: “ఇంట్లో బాబాయ్‌ని చంపి పచ్చి నెత్తురు తాగిన రాక్షసుడు జగన్” – మంత్రి నారా లోకేష్ సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనమయ్యే వ్యాఖ్యలు వినిపించాయి. ఈ సారి, ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఎక్స్ (మాజీ ట్విట్టర్)లో జగన్‌ను తీవ్రంగా విమర్శిస్తూ, ఆయనను “పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు” అని అభివర్ణించారు. “నీ పార్టీ పునాదులే నేరాలు, ఘోరాలు. ఈ విషయాన్ని స్వయానా నీ కుటుంబ సభ్యులే చెప్పారు” అంటూ నారా లోకేష్ ఎక్స్ వేదికగా జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఎన్నడూ సమీక్ష నిర్వహించని జగన్, ఇప్పుడు ఆ విషయంపై మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉందని లోకేష్ ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా, లోకేష్ జగన్‌కు ఏడు ప్రశ్నలు సంధించారు. “వీటికి సమాధానం చెప్పగలవా?” అంటూ సవాల్ విసిరారు.

  1. నీ 5 ఏళ్ళ పాలనలో 2,027 మంది మహిళలు దారుణ హత్యకు గుర‌య్యారు. 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారు. ఏ నాడైనా, ఒక్క మహిళ దగ్గరకు వెళ్లి పరామర్శ చేసావా ? కనీసం ఒక్కసారైనా ఖండించావా ? ఒక్కసారైనా సమీక్ష చేసావా ?
  2. నీ పాలనలో కోనసీమ జిల్లాలో 12 ఏళ్ల బాలికపైన ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. విజయవాడలో యువతిని 11 కత్తిపోట్లు పొడిచి చంపారు. నీ ఇంటి సమీపంలోని సీతానగరంలో యువతిపై అత్యాచారం జరిగితే కనీసం స్పందించలేదు. నీకు అసలు మాట్లాడే అర్హత ఉందా జగన్ ? ఇలాంటి ఘటనలు కొన్ని వందలు ఉన్నాయి.
  3. నీ 5 ఏళ్ళ పాలనలో, నీ ముఠా మొత్తం ఎస్సీ, ఎస్టీల‌పై ఇష్టానుసారంగా దాడులకు తెగబడ్డారు. ఎస్సీలు 192 మంది, ఎస్టీలు 58 మంది హత్యకు గురయ్యారు. మైనార్టీల‌పైనా దాడులకు పాల్పడ్డారు. అబ్దుల్ సలాం కుటుంబ ఘటన కంటే ఘోరమైన సంఘటన రాష్ట్రంలో మరొకటి ఉంటుందా. నరసరావుపేటలో వక్ఫ్ ఆస్తులు కాపాడాలని కోరిన ఇబ్రహీంను నడిరోడ్డుపై చంపారు. పలమనేరులో మిస్బా అనే 10వ తరగతి విద్యార్థిని బాగా చదువుతుంది. వైసీపీ నేత కూతురు కంటే చదువులో ముందంజలో ఉందని వేధించడంతో ఆత్మహత్య చేసుకుంది. మైనారిటీ ఆడబిడ్డ కష్టపడి చదువుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేశారు. నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావా జగన్ ?
  4. దిశ చట్టం అంటూ లేని చట్టాన్ని ఉన్నట్లు ప్రచారం చేస్తున్నావ్. దిశ చట్టంలో లోపాలున్నాయని కేంద్రం తిప్పి పంపితే, ఇక ఆ త‌ర్వాత మళ్లీ దాని గురించి పట్టించుకోలేదు. లేని చట్టం పేరుతో పోలీస్ స్టేషన్లు పెట్టి యాప్ డౌన్లోడ్ చేయించారు. ఆడబిడ్డలపై అత్యాచారం చేస్తే దిశ చట్ట ప్రకారం ఉరిశిక్ష వేస్తామని చెప్పిన వ్యక్తి ఒక్కరికైనా వేశారా? ఎందుకీ అబద్ధపు బ్రతుకు జగన్ ?
  5. రాష్ట్రంలో జరికే ప్రతి నేరానికి, నువ్వు పెంచి పోషించిన గంజాయి మాఫియానే కారణం. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు ఏపీలోనే ఉండేలా నీ పాలన సాగింది. ఒక్కసారైనా గంజాయిపై సమీక్ష చేసావా ? మేము రాగానే, గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని తయారు చేయటానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం.
  6. 2014-19 మధ్య రాష్ట్రంలో 14,770 ఆటోమేటిక్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. పోలీసులకు బాడీ వార్న్ కెమెరాలు పెడితే, నువ్వు రాగానే వాటిని మూల పడేసింది నిజం కాదా ? ఆటోమేటిక్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ విధానాన్ని నాశనం చేసింది నువ్వు కాదా? ఇవన్నీ నువ్వు , నీ పార్టీలో ఉండే క్రిమినల్స్ దొరక్కుండా ఉండటానికి, నువ్వు వేసిన ప్లాన్ కాదా ?
  7. కూటమి ప్రభుత్వం రాగానే, 5 ఏళ్ళ పాటు నువ్వు సమాజంలో నాటిన విష భీజాలు పీకి పడేసే పనిలో ఉంది. 120 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకుని వచ్చాం. గంజాయిపై ముందు దృష్టి పెట్టాం. గంజాయి మత్తులో జరుగుతున్న క్రైమ్స్ పై ఉక్కు పాదం మోపుతున్నాం. ఏ ఘటన జరిగినా వెంటనే చర్యలు తీసుకుని, నేరం చేసిన వాడిని అరెస్ట్ చేస్తున్నాం. కేసు తీవ్రతని బట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. సమాజంలో నీ లాంటి సైకోలు, ఊరికో సైకోని తయారు చేసాడు. ఈ సైకోలని కంట్రోల్ లో పెట్టటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అయినా కొన్ని దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి. జరిగిన వెంటనే చర్యలు ఉంటున్నాయి. నీ లాగా నిద్ర పోవటం లేదు
  8. సీమలో నువ్వు, నీ కుటుంబం పెంచి పోషించిన ఫ్యాక్షనిజం అణిచివేసిన చరిత్ర చంద్రబాబు గారిది. సొంత పార్టీ నేతలను కూడా ఉపేక్షించకుండా అరెస్ట్ చేసిన చరిత్ర చంద్రబాబు గారిది. నువ్వు, నీ కుటుంబం రౌడీలని పెంచి పోషిస్తే, రౌడీ అనే పేరు వినబడటానికే భయపడేలా పీడీ యాక్ట్ పెట్టి శిక్షించింది చంద్రబాబు గారు. మత కలహాలు లేకుండా చేసింది చంద్రబాబు గారు. తీవ్రవాదం పై పోరాడింది చంద్రబాబు గారు. ఇప్పుడు కూడా గత 5 ఏళ్ళు నువ్వు పెంచి పోషించిన సైకోలని, రాష్ట్రం నుంచి తరిమి కొట్టి, సైకోల ఫ్రీ రాష్ట్రంగా చేసేది కూడా చంద్రబాబు గారే.” అని లోకేష్ పేర్కొన్నారు.

జగన్ పతనానికి సిద్ధం

లోకేష్ తన వ్యాఖ్యల చివర్లో, “మేము రాగానే, గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని తయారు చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. గత ఐదేళ్లు నువ్వు నాటిన విష భీజాలు పీకి పడేసేందుకు కూటమి సిద్ధంగా ఉంది” అని పేర్కొన్నారు. జగన్ పాలనలో పెరిగిన నేరాలను నిరోధించేందుకు చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular