అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో పేదల సొంత ఇంటి కల నెరవేర్చడంలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం బోటు యార్డు వద్ద గృహ నిర్మాణ సంస్థ నిర్మించిన ఒక మోడల్ గృహాన్ని సీఎం వైఎస్ జగన్ బుధవారం పరిశీలించారు. హాలు, బాత్ రూమ్, కిచెన్, బెడ్ రూమ్, ఫ్లోరింగ్, బయట వరండాను, మెటీరియల్ నాణ్యతను నిశితంగా పరిశీలించారు.
ఇంటి నిర్మాణానికి వినియోగించిన మెటీరియల్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట ఏపీ మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాధ రాజు, కొడాలి నాని, మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పలువురు అధికారులు ఉన్నారు.
రాష్ట్రంలో అర్హులైన 30 లక్షల మంది పేదలకు ఇంటి స్థలానికి సంబంధించిన పట్టాలను అందజేయడంతో పాటు పక్కా ఇంటిని నాణ్యతతో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసింది. 17,000 వైఎస్సార్ జగనన్న కాలనీలలో పక్కా ఇళ్లను నిర్మించనుంది. మొదటి విడతలో 15 లక్షలు, రెండో విడతలో మరో 15 లక్షల ఇళ్లు నిర్మిస్తామని గృహ నిర్మాణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ మోడల్ హౌస్ తరహాలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. బుధవారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో కలిసి మోడల్ హౌస్ను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సిఎం ఈ ఇంటిపై సంతృప్తి వ్యక్తం చేశారని, రాష్ట్రంలో ఇదే తరహాలో పేదల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు.