హైదరాబాద్ : ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ మంత్రి, టీఆర్ఎస్ దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్య కన్నుమూశారు. ఆమె అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు.
నాయిని నరసింహారెడ్డి ఈ నెల 22న మరణించారు. ఇటీవల నాయిని, ఆయన భార్య అహల్య ఇద్దరూ కరోనా బారిన పడ్డారు. దీంతో ఇద్దరు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. భర్త నాయిని నర్సింహ రెడ్డి మృతితో ఆఖరి చూపుకు అహల్యను కుటుంబ సభ్యులు అంబులెన్స్లో తీసుకొచ్చారు.
అయితే ఇటీవల ఆమెకు కరోనా నెగటీవ్ వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. నాయిని మృతి చెందిన ఐదు రోజులు కూడా గడవకముందే ఆయన భార్య అహల్య కూడా కన్నుమూశారు. ఆమె వయసు 68 సంవత్సరాలు. దీంతో నాయిని నర్సింహారెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో నిన్న తుదిశ్వాస విడిచారు. వారం రోజులు కూడా గడకముందే భార్యాభర్తలు ఒకరి తర్వాత ఒకరు మృతి చెందడంతో నాయిని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.