న్యూఢిల్లీ: భారత దేశ సార్వభౌమాధికారం, రక్షణ మరియు సమగ్రతకు భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటూ ఇప్పటికే భారీగా చైనా యాప్లపై వేటు వేసిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మరో 43 చైనా మొబైల్ యాప్లను ఈ రోజు నిషేధించింది.
ఈ జాబితాలో మాంగో టీవీ, అలీసప్లయర్స్ మొబైల్ యాప్, అలీబాబా వర్క్బెంచ్, క్యామ్కార్డ్, అలీఎక్స్ప్రెస్ లాంటివి ఉన్నాయి. ఈ మేరకు సమాచార మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యాప్ లు దేశంలో చట్టవిరుద్ద కారక్రమాలల్లో పాలు పంచుకుంటున్నాయన్న సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన సమగ్ర నివేదికల ఆధారంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 ఏ కింద ఈ చర్య తీసుకున్నట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది.
వీటితోపాటు విడేట్, సింగోల్, ట్రూలీ చైనీస్, ట్రూలీ ఏషియన్, చైనాలోవ్, డేట్మైజ్, ఏషియన్ డేట్, ఫ్లిర్ట్విష్, గైస్ ఓన్లీ డేటింగ్, రెలా తదితర డేటింగ్ యాప్లను కూడా బ్లాక్ చేసింది. ప్రధానంగా జనాదరణ పొందిన షాపింగ్ వెబ్సైట్ అలీఎక్స్ప్రెస్ను కూడా నిషేధించింది, చైనీస్ ఇ-కామర్స్ దిగ్గజం అయిన అలీబాబాకు ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బ.
తూర్పు లడఖ్లోని దేశసరిహద్దు ప్రాంతం వద్ద చైనా దుశ్చర్య, ఉద్రిక్తతల మధ్య పలు యాప్లపై కొరడా ఝళిపించింది. ఈ ఏడాది జూన్ 29న 59 యాప్లను, సెప్టెంబర్ 2న మరో 118 చైనా యాప్లను నిషేధించింది. వీటిలో ప్రముఖ చైనాయాప్లు టిక్టాక్, షేర్ఇట్, హెలో, షెయిన్, లైక్, వీచాట్, యుసి బ్రౌజర్ లాంటివి ఉన్న సంగతి తెలిసిందే.