తిరుమల: రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమల శ్రీవారి మెట్టు మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. నివర్ తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు శ్రీవారి మెట్టు నడక మార్గంలో బండరాళ్లు విరిగిపడుతున్నాయి.
దీని వల్ల తిరుమల భక్తులకు ప్రమాదం పొంచి ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యలుగా శ్రీవారి మెట్టు నడకదారిని టీటీడీ అధికారులు మూసివేశారు. భారీ వర్షాలతో తిరుమలలో జలాశయాలు పూర్తిగా వర్షం నీటితో నిండాయి. పాప వినాశనం, ఆకాశ గంగ, గొగర్బం, కేపీ డ్యామ్ గేట్లు అధికారులు ఎత్తివేశారు.
అలాగే చిత్తూరు జిల్లా ఏర్పేడు, మల్లిమడుగు వాగులో ముగ్గురు రైతులు గల్లంతయ్యారు. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు ఇద్దరిని రక్షించగా, మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితులకు ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అండగా నిలిచారు.
తూర్పుగోదావరి జిల్లా లో తుపాన్ కారణంగా అన్నవరం సత్యదేవుని తెప్పోత్సవాన్ని దేవస్థానం అధికారులు ఆపేశారు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా రాత్రి 7 గంటలకు జరగాల్సిన తెప్పోత్సవంకు భారీ వర్షాల వల్ల ఆటంకం కలిగింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు దేవస్థానం ఈవో త్రినాథ్ తెలిపారు.