సిమ్లా: ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమాలు కరోనా వ్యాప్తి తగ్గించడం కోసం తెచ్చినా, చాలా మంది ప్రజలు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నియమాలు ఉల్లంఘించేవారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.
ఈ తరుణంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించని వారు ఎవరైనా కనిపిస్తే తక్షణమే వారిని అరెస్ట్ చేసి జైల్లో వేయాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ సందర్భంగా సిర్మౌర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ, ‘ప్రజలు ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండా కనబడితే, వారెంట్తో సంబంధం లేకుండా వారిని అరెస్ట్ చేస్తాం. ఇక నేరం రుజువైతే వారికి ఎనిమిది రోజుల జైలు శిక్షతోపాటు ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధిస్తాం’ అని ఆయన తెలిపారు.
కరోనా కట్టడికి ప్రజలంతా తప్పక మాస్క్ ధరించాల్సిందిగా పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశాయి. ముఖ్యంగా బహిరంగా ప్రదేశాల్లో మాస్క్ ధరించడాన్ని తప్పని సరి చేశాయి. తాజాగా ఢిల్లీలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దాంతో మాస్క్ ధరించని వారికి 500-5,000 రూపాయల వరకు చలాన్లు విధిస్తోంది. అలానే ఢిల్లీ పరిపాలన అధికారులు నగరం అంతటా తనిఖీని ముమ్మరం చేశారు.
చాలా చోట్ల, సివిల్ డిఫెన్స్ సిబ్బందికి, మాస్క్ ధరించని ప్రజలకు మధ్య తరచుగా గొడవలు జరగడం చూస్తూనే ఉన్నాం. కరోనావైరస్ నియంత్రణకు గాను రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎనిమిది జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ విధించింది.