అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీసులు టెక్నాలజీ వినయోగం విషయంలో మరోసారి దేశంలోనే సత్తా చాటారు. టెక్నాలజీ వినియోగంపై స్కోచ్ గ్రూప్ ప్రకటించిన 18 అవార్డులలో ఐదు అవార్డులను ఏపీ పోలీసు శాఖ సొంతం చేసుకుంది. జాతీయ స్థాయిలో నెల వ్యవధిలో ఏపీ పోలీసు శాఖ మూడో సారి భారీగా అవార్డులను కైవసం చేసుకోవడం విశేషం.
నేడు ప్రకటించిన అవార్డుల్లో ప్రాజెక్ట్ టాటా, సైబర్ మిత్ర(మహిళ భద్రత)కుగాను ఏపీ పోలీసు శాఖ రజత పతకాలు కైవసం చేసుకుంది. వీటితో పాటు అఫెండర్ సెర్చ్, ఉమెన్ సేఫ్టీ (విజయనగరం జిల్లా), సువిధ(అనంతపురం), ప్రాజెక్ట్ టాటా (ప్రకాశం జిల్లా)విభాగాల్లో ఐదు స్కోచ్ అవార్డులు గెలుచుకుంది.
కేవలం 11 నెలల కాల వ్యవధిలో జాతీయ స్థాయిలో 108 అవార్డులను సొంతం చేసుకొని ఏపీ పోలీసు శాఖ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు సాధించిన అవార్డుల్లో రెండు బంగారు, 13 రజత పతకాలను కైవసం చేసుకొన్నది. అందుబాటులో ఉన్న అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్న సిబ్బందిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంజ్ అభినందించారు.