ముంబై: భారత దేశంలో బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీ నేర చరిత్ర మూలంగా తమ జీవితాలు నాశనమైపోయాయంటూ నీరవ్ సోదరి పూర్వి, ఆమె భర్త మైయాంక్ మెహతా సంచలన ఆరోపణలు చేశారు.
తాంఉ ఈ కుంభకోణం కేసులో చాలా కీలకమైన సాక్ష్యాలను ఇస్తామంటూ వారు అప్రూవర్గా మారేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. దీంతో వేలకోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీకి భారీ షాక్ తగిలింది. పీఎన్బీ స్కాం, నీరవ్ నుంచి తమను దూరం చేయాలని కోరుతూ పూర్వి మోదీ, ఆమె భర్త కోర్టును ఆశ్రయించారు.
ఇంకా ఈ కుంభకోణానికి సంబంధించి కీలక సమాచారాన్ని, సాక్ష్యాలను అందించేందుకు వారు అంగీకరించారు. అతని నేరపూరిత కార్యకలాపాలు మూలంగా తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు స్థంభించి పోయాయని వారు వాపోయారు. ఈ మేరకు వారు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వీరిని ప్రాసిక్యూషన్ సాక్షులుగా ముంబైలోని ప్రత్యేక మనీలాండరింగ్ నిరోధక చట్టం కోర్టు అనుమతించింది.
అయితే ఈ స్కాంలో నీరవ్, అతని మామ మెహుల్ చోక్సీ, కొంతమంది బ్యాంకు అధికారులతో కుమ్మక్కై తప్పుడు పత్రాలతో పీఎన్బీని రూ .14 వేల కోట్లకు కుచ్చుటోపీ పెట్టారు. అనంతరం విదేశాలకు పారిపోయిన నీరవ్ను 2019 మార్చిలో భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లండన్ జైల్లో ఉన్న నీరవ్ను భారత్కు అప్పగించే అంశం విచారణలో ఉంది.