చైనా: కరోనా వైరస్ మహమ్మారి పుట్టిల్లైన చైనాను మరోసారి ఆ వైరస్ పట్టి పీడిస్తోంది. 2019లో చైనాలోని వూహాన్ నగరంలో వైరస్ వ్యాపించిన తర్వాత పెద్ద ఎత్తున చైనా అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కరోనా వైరస్ వ్యాపించిన ప్రాంతాల్లో భారీగా టెస్టింగులతో పాటు లాక్డౌన్లు విధించడంతో వైరస్ వ్యాప్తిని వారు చాలా వరకు నియంత్రించారు.
ఇప్పుడు తిరిగి మళ్ళీ చైనాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. చైనా రాజధాని అయిన బీజింగ్కు దక్షిణంగా ఉన్న రెండు ముఖ్య నగరాలలో అక్కడి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ప్రస్తుతం ఆ నగర రహదారులను మూసివేయడంతో పాటు రవాణా సౌకర్యాలను కూడా నిలిపివేసింది.
చైనాలోని ఉత్తర భాగపు హెబీ ప్రావిన్స్లో గత వారంలో 127 కొత్త కోవిడ్-19 కేసులు, అదనంగా 183 లక్షణాలు లేని ఇన్ఫెక్షన్లు కనిపించాయి. 2019 తర్వాత చైనాలో ఇన్ని కేసులు ఒకేసారి వెలుగుచూడటం ఇదే తోలిసారి. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు హెబై ప్రావిన్స్లోని షిజియాషాంగ్, జింగ్టాయ్ సిటీల్లో లాక్డౌన్ విధించారు. ప్రజలు అత్యంత అవసరం అయితే తప్ప బయటకి రాకూడదని పిలుపునిచ్చారు.
హెబీ ప్రావిన్స్లోని నివాసితులు బీజింగ్లోకి ప్రవేశించకుండా కఠిన ఆంక్షలు కూడా విధించారు. విదేశాల నుండి వచ్చిన వ్యక్తులు మరియు ఆహార ప్యాకేజింగ్ పదార్థాల ద్వారా చైనాలోకి ఈ వైరస్ ప్రవేశించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు.