హైదరాబాద్ : 9వ తరగతి, ఆపై తరగతులకు క్లాసులకు ఫిబ్రవరి 1నుంచి తెలంగాణలో తరగతులు ప్రారంభం కానున్నాయి. 9వ తరగతి, ఆపై తరగతులకు క్లాసులు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్లో మంత్రులు, కలెక్టర్లతో జరిగిన సమీక్షలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
పాఠశాలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు తిరిగి తెరుచుకునేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. కోవిడ్ కారణంగా ఇప్పటికే విద్యాసంస్థలు మూతబడిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 1నుంచి క్లాసులు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 10 నెలల అనంతరం విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి.
సీఎం ఉన్నతాధికారుల మధ్య జరిగిన సమీక్షలో మరికొన్ని కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రెవెన్యూకు సంబంధించిన అన్నిరకాల సమస్యలను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్లో అవసరమైన అన్నిరకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
ఆ పై కరోనా వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అన్నిశాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీలన్నీ ఒకేసారి వెంటనే భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.