న్యూఢిల్లీ: మెస్సేజింగ్ దిగ్గజం వాట్సాప్ నూతనంగా ప్రవేశ పెట్టిన ప్రైవసీ పాలసీ నిబంధనలపై కొద్ది రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ రోజు హైకోర్టు వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ విధానంపై వాట్సాప్, ఫేస్బుక్లకు నోటీసు ఇవ్వడానికి నిరాకరించింది.
ఈ కేసులో జరిగిన వాదనల సందర్భంగా హైకోర్టు వాట్సాప్ అనేది ఒక ప్రైవేట్ యాప్, కాబట్టి ప్రజలు దీనిని ఉపయోగించకుండా ఉండటానికి స్వేచ్ఛ ఉందని కోర్టు తెలిపింది. విచారణ ప్రారంభంలోనే జస్టిస్ సంజీవ్ సచ్దేవా పిటిషనర్తో మాట్లాడుతూ, వాట్సాప్ ఓ ప్రైవేట్ యాప్ అని యూజర్లకు ఇష్టమైతే వాడుకోవచ్చునని లేదా తీసేయొచ్చునని ఆయన స్పష్టం చేసారు.
ఇంతకుముందు మ్యాప్స్, బ్రౌజర్ వంటి ఇతర యాప్స్ కూడా ఇలాంటి ప్రైవసీ విధానాలను తీసుకొచ్చాయి అని కూడా కోర్టు అభిప్రాయపడింది. పిటిషనర్ ఒక వాట్సాప్ యాప్ నే నిందించడం సరికాదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. వినియోగదారులు ఇతర యాప్స్ యొక్క నిబంధనలు, షరతులను చదివితే వాట్సాప్ తరహా నిబంధనలే కనిపిస్తాయని పేర్కొంది. అనంతరం ఈ విచారణను జనవరి 25కు కోర్టు వాయిదా వేసింది.