హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఉద్యోగుల కల్పన భారీగా తగ్గుముఖం పట్టింది. ప్రైవేటు జాబ్స్ రంగంలో వృద్ధి రేటు బాగా మందగించింది. గతే ఏడాది చివరి నాటికి మహానగరం పరిధిలో ఉద్యోగాల వృద్ధి కేవలం ఒకే ఒక్కశాతానికి పరిమితమైంది. ఉపాధి కల్పన సైటు అయిన నౌకరీ డాట్కామ్ జరిపిన ఒక అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. ఈ విషయంలో పింక్సిటీ జైపూర్ 40 శాతం వృద్ధిరేటును సాధించి అగ్రభాగాన నిలిచింది.
ఛండీగడ్లో 14 శాతం వృద్ధితో రెండోస్థానంలో, మూడోస్థానంలో నిలిచిన దేశ రాజధాని ఢిల్లీ 10 శాతం వృద్ధి సాధించింది. నాలుగో స్థానానికి పరిమితమైన ముంబయిలో 8 శాతం, ఆరోస్థానంలో నిలిచిన కోయంబత్తూర్లో 6 శాతం, ఏడోస్థానంలో నిలిచిన అహ్మదాబాద్లో 5 శాతం వృద్ధి నమోదవడం గమనార్హం. ఇక గ్రేటర్ సిటీ కేవలం ఒక్కశాతం వృద్ధితో సరిపెట్టుకుంది. మన కంటే అధ్వాన్నంగా ఉన్న నగరాల్లో, కొచ్చిన్ సున్న శాతం, బెంగళూరు, కోల్కతా నగరాలు మైనస్ 4 శాతం వృద్ధిరేటుతో తిరోగమనంలో ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది.
ఉపాధి కల్పన వృద్ధిరేటు మందగించడానికి లాక్డౌన్, కోవిడ్ కలకలమే కారణమని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. లాక్డౌన్ కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక ప్రదేశాలు, ట్రావెల్స్ మూతపడడంతో ఈరంగం కుదేలైంది. ప్రధానంగా హోటల్స్, రెస్టారెంట్లు, ఎయిర్లైన్స్ టూరిజం రంగాలు కుదేలు కావడంతో ఆతిథ్యరంగంలో 80 శాతం మేర వృద్ధి రేటు పడిపోయిందట. ఇక రిటైల్ రంగంలోనూ 71 శాతం నెగెటివ్ వృద్ధి నమోదైంది.