హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. ఆంధ్ర, తెలంగాణాలో ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికల నిర్వహణకు గాను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ సదరు షెడ్యూల్ను ప్రకటించింది.
ఈ ఎన్నికలకు సంబంధించి ఈనెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుందని, మార్చి 14వ తేదీన పోలింగ్ జరుగుతుందని తెలిపింది. మార్చి 17వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. ఏపీలో 2 ఉపాధ్యాయ, తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల స్థానాలు త్వరలో ఖాళీ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా షెడ్యూల్ వెలువడింది.
ఆంధ్రలో తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరపనున్నారు. ఏపీలో ఆర్ఎస్ఆర్ మాస్టారు, రామకృష్ట ఇద్దరు రిటైర్ అవనున్నారు. ఇక తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్తో పాటు నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
కాగా తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించేసింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ అభ్యర్థిగా రాములు నాయక్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి చిన్నారెడ్డిని ఖరారు చేసింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్రెడ్డిని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.