బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణిపై ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజలకు సొంతంగా ఒక టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం లాంటివి ఉంటే వారి రేషన్ కార్డును రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. బిలో పావర్టీ లైన్ తరగతి ప్రజలకు కార్డుల మంజూరు విషయంలో ఇకపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుందని ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖమంత్రి ఉమేష్ కత్తి స్పష్టం చేశారు.
ఆయన సోమవారం బెళగావిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సదరు ప్రకటన చేశారు. రాష్ట్రంలో చాలా మండి ఉన్నత వర్గాలకు చెందిన వారు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రేషన్ సరుకులను ఉపయోగించుకుంటున్నారని, దీని ద్వారా వెనుకబడిన వారికి సరుకులు చేరకున్నాయని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునే ఉద్ధేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ సరఫరా చేస్తోందని, ఇకపై సరైన అర్హుల జాబితాను రూపొందిస్తామని స్పష్టం చేశారు.
అలాగే కుటుంబానికి 1.20 లక్షల వార్షిక ఆదాయం కంటే వక్కువ ఉంటే వారు ఉచిత రేషన్కు అర్హులు కాదన్నారు. అలాగే టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం ఉన్నా కూడా వారు రేషన్ కార్డును వెంటనే స్వచ్చందంగా వదులుకోవాలన్నారు. అలాంటి కార్డులను మార్చి 31 లోగా కార్డును వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించారు.
ఇక ఎవరైనా తిరిగి ఇవ్వకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉమేష్ కత్తి హెచ్చరించారు. ప్రభుత్వ ప్రతిపాదనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీవీ, ఫ్రిజ్ అనేవి నేడు నిత్యవసర వస్తుల జాబితాలో చేరిపోయాయని, వాటి కారణం చేత కార్డులను తొలగించడం సరైనది కాదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.