అమరావతి: ఏపీ బడ్జెట్ ₹3.22 లక్షల కోట్లు – సంక్షేమ, అభివృద్ధికి పెద్దపీట
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3.22 లక్షల కోట్ల బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు భారీ కేటాయింపులు చేశారు.
మొత్తం బడ్జెట్ కేటాయింపులు
- మొత్తం బడ్జెట్ – ₹3,22,181 కోట్లు
- రెవెన్యూ వ్యయం – ₹2,51,162 కోట్లు
- మూలధన వ్యయం – ₹40,635 కోట్లు
- రెవెన్యూ లోటు – ₹33,185 కోట్లు
- ద్రవ్య లోటు – ₹79,926 కోట్లు
వ్యవసాయానికి భారీ కేటాయింపులు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన వ్యవసాయ రంగానికి రూ. 48 వేల కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 6,705 కోట్లు మంజూరు చేశారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్నదాత సుఖీభవ పథకానికి రూ. 6,300 కోట్లు కేటాయించారు.
విద్యా రంగానికి ప్రాధాన్యత
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పాఠశాల విద్య శాఖకు రూ. 31,805 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యా అభివృద్ధి కోసం రూ. 2,506 కోట్లు కేటాయించగా, నైపుణ్యాభివృద్ధికి రూ. 1,228 కోట్లు వెచ్చిస్తున్నారు.
సమాజహిత కార్యక్రమాలకు భారీ నిధులు
బీసీ సంక్షేమానికి రూ. 47,456 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ. 20,281 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ. 8,159 కోట్లు, అల్పసంఖ్యాక వర్గాల అభివృద్ధికి రూ. 5,434 కోట్లు కేటాయించారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి రూ. 4,332 కోట్లు మంజూరు చేశారు.
గ్రామ, పట్టణాభివృద్ధికి భారీ నిధులు
గ్రామీణాభివృద్ధి కోసం పంచాయతీ రాజ్ శాఖకు రూ. 18,847 కోట్లు, పురపాలక శాఖకు రూ. 13,862 కోట్లు కేటాయించారు. ప్రజలకు ఆధునిక వసతులు అందించేందుకు గృహనిర్మాణ శాఖకు రూ. 6,318 కోట్లు మంజూరు చేశారు.
జలవనరుల అభివృద్ధి
నీటి వనరుల అభివృద్ధికి రూ. 18,019 కోట్లు కేటాయించారు. రహదారుల అభివృద్ధి కోసం ఆర్ అండ్ బీ శాఖకు రూ. 8,785 కోట్లు కేటాయించారు.
ఇంధన, భాషా అభివృద్ధి
ఇంధన రంగ అభివృద్ధికి రూ. 13,600 కోట్లు, తెలుగు భాష ప్రచారం, అభివృద్ధికి రూ. 10 కోట్లు కేటాయించడం విశేషం.