అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సచివాలయం మొదటి బ్లాక్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, మంత్రులు కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. గతంలో రాష్ట్రంలో తీసుకున్న కీలక నిర్ణయాలకు ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
రాష్ట్రంలో అమలు లో ఉన్న నవరత్నాలు పథకాలపై ఈ ఏడాది క్యాలెండర్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే ఏప్రిల్ 2021 నుంచి జనవరి 2022 వరకు పథకాల అమలుకు తీసుకున్న నిర్ణయాలను మంత్రి మండలి ఆమోదించింది. కేబినెట్ ఆమోదంతో 5.8 కోట్ల మంది లబ్ధిదారులకు అందించే పథకాల క్యాలెండర్ అమల్లోకి రాబోతోంది.
అలాగే ‘ఈబీసీ నేస్తం’ అనే కొత్త పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఈబీసీ మహిళలకు మూడేళ్లలో రూ.45వేల ఆర్ధిక సాయం అందనుంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను 300 చదరపు అడుగుల లోపు ఉంటే, రూపాయికే లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.