న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సీఎం, సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు ఇక్కడి హోం మంత్రి నివాసంలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
వీటితోపాటు దిశ చట్టం, శాసన మండలి రద్దు, చట్ట రూపు దాల్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్టు హోం మంత్రి వర్గాలు తెలిపాయి. విభజన వల్ల జరిగిన నష్టంతోపాటు, కోవిడ్-19 కారణంగా ఆర్థిక వనరుల తీవ్ర లేమితో ఇక్కట్లు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అన్ని విధాలుగా సాయం చేయాలని సీఎం కోరారని తెలిసింది. హోం మంత్రితో సమావేశానికి ముఖ్యమంత్రి వెంట వైఎస్సార్సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా వెళ్లారు.
అయితే బుధవారం ఉదయం 10.30 గంటలకు మరోసారి కేంద్ర హోం మంత్రి అమిత్షాతో సీఎం సమావేశం కానున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. దానికి ముందు ఉదయం 9 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టుకు వెచ్చించిన రూ.4 వేల కోట్ల మేర రీయింబర్స్ చేయాలని, పునరావాస సాయం త్వరితగతిన అందించాలని కోరనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.కె.మిశ్రా, ప్రధాన మంత్రి సలహాదారు భాస్కర్ కుల్బేతో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్సభా పక్ష నేత పీవీ మిథున్రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
వెనకబడిన జిల్లాలకు సంబంధించి ప్రత్యేక ఆర్థిక సహాయం పొందుతున్న కలహండి, బుందేల్ఖండ్ ప్రాంతాల్లో తలసరి సగటున రూ.4,000 ఇస్తే, ఏపీలో వెనకబడిన 7 జిల్లాల్లో కేవలం రూ.400 చొప్పున మాత్రమే ఇస్తున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన జిల్లాలకు కూడా అదే తరహాలో పెంచి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదికలో చెప్పిందని, దీనిని పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక హోదాను రాష్ట్రానికి వర్తింపజేయాలని కోరారు. ఏపీ విభజన చట్టంలో పొందు పరిచిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయడం ద్వారా పారిశ్రామిక ప్రగతికి చేయూత ఇవ్వాలని కోరారు. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్టు, విశాఖపట్నం– చెన్నై కారిడార్, కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్ కోసం తగిన ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
పోలీసు వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాలన్నీ హైదరాబాద్లోనే ఉండిపోయాయని, ఈ విషయంలో ఏపీ పోలీస్ విభాగం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోందని వివరించారు. అవసరమైన వ్యవస్థలు, సామర్థ్యాల పెంపునకు ప్రయత్నాలు జరిగినా నిధుల లేమి, సిబ్బంది కొరత వల్ల ఆశించిన లక్ష్యాలను చేరుకోలేదన్నారు. అవసరాలకు అనుగుణంగా పోలీసు విభాగం సమర్థతను పెంచేలా సహాయం చేయాలని కోరారు.