అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్–2020 ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం విడుదల చేశారు.
ఈ సారి ఎంసెట్ లో ఇంజినీరింగ్లో 84.78 శాతం, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో 91.77 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. విద్యార్థుల మొబైల్ నంబర్లకు కూడా ర్యాంకుల వివరాలు వస్తాయని ఆయన తెలిపారు. ఆన్లైన్ (సీబీటీ) విధానంలో జరిగిన ఈ పరీక్షలను హైదరాబాద్తో పాటు ఏపీలోని మొత్తం 47 నగరాల్లో 118 కేంద్రాల్లో నిర్వహించారు.
సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 25 వరకు ఉదయం, మధ్యాహ్నం మొత్తం 14 సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్ విభాగంతో 1,33,066 మంది విద్యార్థులు, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో 69,616 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఇంజినీరింగ్లో ఫస్ట్ ర్యాంక్ : వావిలపల్లి సాయినాథ్(విశాఖ),రెండో ర్యాంక్ : కుమార్ సత్యం (హైదరాబాద్) సాధించారు. అగ్రికల్చర్, మెడిసిన్లో ఫస్ట్ర్యాంక్: చైతన్య సింధు(తెనాలి), రెండో ర్యాంక్: లక్ష్మి సామయి మారుతి (తాడికొండ) సాధించారు.