అమరావతి: ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పని వేళల మార్పులపై ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ఉన్న పాఠశాలల సమయాల్లో విద్యాశాఖ సవరణలు చేసింది. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ప్రాథమిక పాఠశాలు, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నిర్వహణ వేళల మార్పులు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం నిర్వహించిన మన బడి నాడు–నేడు, మధ్యాహ్న భోజన పథకంపై సమీక్షలో రాష్ట్రంలోని పాఠశాలలన్నీ ఇక నుండి ఉదయం 9 గంటలకే ప్రారంభం అయ్యేలా చూడాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉదయం వేళ సాధ్యమైనంత త్వరగా స్కూళ్లలో బోధన ప్రారంభించడం మంచిదని సూచించారు.
ఉదయం పూట పిల్లల్లో చురుకుదనం బాగా ఉంటుందని, వారి మెదడు కూడా విషయాలను శీఘ్రంగా గ్రహించగలుగుతుందని, ఆ సమయంలో పాఠ్యబోధన సాగిస్తే పిల్లలు ఆయా అంశాలను త్వరితంగా, లోతుగా అవగాహన చేసుకోగలరన్నారు.
ఆయన ప్రపంచంలో పాఠశాలలన్నీ దాదాపుగా ఉదయం 8 లేదా 8.30 గంటలకల్లా ప్రారంభమవుతున్నాయని, వాటికి భిన్నంగా మన రాష్ట్రంలో ఆలస్యంగా 9.30కు ప్రారంభం కావడం వల్ల అనుకున్న ఫలితాలను సాధించడానికి వీలుండదన్న చర్చ జరిగింది. ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే వాటిని పరిష్కరించుకొని రాష్ట్రంలో కనీసం 9 గంటలకల్లా స్కూళ్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.