అమరావతి : కోవిడ్ కారణంగా మూతపడ్డ పాఠశాలను తిరిగి తెరవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలను ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. దీనిపై అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని అక్టోబర్ 5 నుండి స్కూల్స్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడే అన్లాక్ 5 మార్గదర్శకాలు వచ్చిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని అధికారుల సమావేశం లో పేర్కొన్నారు. విద్యార్థులకు అందించే విద్యా కానుకను ఇప్పటికే సిద్ధంగా ఉంచామని మంత్రి స్పతెలిపారు. కరోనా అనంతరం కాలేజీలు, యునివర్సిటీల్లో అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయని తెలిపారు. కరోనా తర్వాత పరిస్థితులు అంచనా వేసి అనేక మార్గదర్శకాలు సిద్దం చేశామని పేర్కొన్నారు.
మంగళవారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన మంత్రి సురేష్ పలు అంశాలను ప్రస్తావించారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీకి మూడు రాజధానులు ఉంటాయి అని ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇది అభివృద్ది వికేంద్రీకరణ మాత్రమే. లక్ష కోట్లు ఒకే ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు.
పథకాలకు పేరు మారుస్తున్నాం అని ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదం. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంలో గతంలో ఇచ్చిన మెనూకు ఇప్పటి మెనూకు ఉన్న తేడాను గమనించాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ కు ఆద్యుడు. రైతులకు ఉచిత కరెంట్ పథకంపై చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేయడం సరైనది కాదు’ అని వ్యాఖ్యానించారు.