హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యా శాఖ ఇంటర్ విద్యార్థులకు ఉద్యోగ, మరియు ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సుల రూపకల్పనపై దృష్టి సారించింది. కాలేజి విద్య తరువాత అనేకమంది ప్రైవేటు కోచింగ్ కేంద్రాలకు వెళ్లి నేర్చుకునే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, మరియు కోడింగ్ తదితర ముఖ్యమైన పది రకాల కోర్సులను ఇంటర్లో నే ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతోంది.
కాగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇలాంటి ఉపయుక్తమైన కోర్సులను షార్ట్ టర్మ్ కోర్సులుగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళిక రచిస్తోంది. ఇంటర్మీడియట్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం పలు వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి కాకుండా 3 నెలల నుంచి 9 నెలల వ్యవధి కలిగిన షార్ట్ టర్మ్ కోర్సులుగా ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది.
రానున్న జూన్ 2021 నుంచే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డాటాసైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, కోడింగ్, ఎంబెడెడ్ సిస్టమ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, అగ్మెంటెడ్ రియాలిటీ, రోబోటిక్స్ వంటి కోర్సులను ప్రవేశ పెట్టబోతున్నట్లు సమాచారం.
జేఎన్టీయూ నేతృత్వంలో ఇండస్ట్రీ, సబ్జెక్టు నిపుణలతో వీటికి సంబంధించిన సిలబస్ను రూపొందించేందుకు ఇప్పటికే ఒక మేధావి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో కోర్సుల కాల వ్యవధిని నిర్ణయించనుంది. ఈ కోర్సుల్లో 40 శాతం విద్య బోధన రూపంలో ఉండనుండగా, 60 శాతం ప్రాక్టికల్ రూపంలోనే విద్యను అందించనుంది.
ఇలాంటి వృత్తి ఆధారిత కోర్సులలో నైపుణ్యం పెంచుకోవడం ద్వారా విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటయని, పైగా ఇంటర్మీడియట్ విద్యా శాఖ ఇచ్చే సర్టిఫికెట్కు విలువ ఎక్కువగా ఉంటుందని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం షార్ట్ టర్మ్ కోర్సులుగా వాటిని ప్రవేశపెట్టి విద్యార్థుల నుంచి వచ్చే స్పందనను బట్టి పూర్తి స్థాయి వృత్తి విద్యా కోర్సులుగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.