న్యూఢిల్లీ: దేశంలో ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్-2020ను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. దేశంలోని నగరాల్లో జీవనం సాగించేందుకు ప్రజలకు అనువైన పరిస్థితుల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయిస్తుంది. దేశంలోని నగరాల్లో మిలియన్కు(10 లక్షల) పైగా జనాభా ఉన్న నగరాల్లో బెంగళూరు తొలి స్థానం సాధించగా, ఆ తరువాతి స్థానాల్లో పుణె, అహ్మదాబాద్ నిలిచాయి.
కాగా దేశ రాజధాని అయిన ఢిల్లీ 13వ స్థానంలో, 15వ స్థానంలో విశాఖ ఉండగా, హైదరాబాద్ మాత్రం 24వ స్థానంలో నిలిచింది. దేశంలో మొదటి పది స్థానాల్లో ఉన్న నగరాల జాబితా ఇలా, వరుస క్రమంలో:
బెంగళూరు, పుణె, అహ్మదాబాద్, చెన్నై, సూరత్, నవీ ముంబై, కోయంబత్తూర్, వడోదర, ఇండోర్, గ్రేటర్ ముంబై నగరాలు ఉన్నాయి. అదే విధంగా 10 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న నగరాల్లో సిమ్లాకు టాప్ ప్లేస్ దక్కింది. ఆ తర్వాతి స్థానాల్లో భువనేశ్వర్, సిల్వాసా, కాకినాడ, సేలం, గాంధీనగర్, గురుగ్రామ్, దేవన్గిరి, తిరుచిరాపల్లి ఉన్నాయి.
ఈ జాబితాకి సంబంధించి 2020 సంవత్సరంలో సర్వే నిర్వహించారు. మొత్తంగా 111 నగరాలు ఇందులో పాల్గొన్నాయి. పట్టణాభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు, మెరుగైన జీవన ప్రమాణాల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించినట్లు పీఐబీ ఒక ప్రకటనలో వెల్లడించింది.