దుబాయ్: భారత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ను వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియన్ లారా ప్రశంసించాడు. పంత్ తన ఆట తీరును పూర్తిగా మార్చేశాడని కొనియాడాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో పంత్ ఆటను చూస్తే ఆ విషయం అర్థమవుతుందన్నాడు. గతంలో ఆఫ్ సైడ్ ప్లే ఆడటంలో ఎంతో బలహీనంగా ఉండే పంత్ ఇప్పుడు దాన్ని అధిగమించాడన్నాడు.
ఒకప్పుడు పంత్ లెగ్ సైడ్ ఆటనే ఎక్కువగా ఆడేవాడని, అది ఇప్పుడు ఛేంజ్ చేశాడన్నాడు. తాను ఆన్సైడ్ ప్లేలో ఒకే తరహా షాట్లు కొడుతూ వికెట్ సమర్పించుకుంటున్న విషయాన్ని తొందరగా గ్రహించాడన్నాడు. ఒకే తరహా ట్రిక్ షాట్లను వదిలిపెట్టి, గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడుతుండటం కనిపిస్తుందన్నాడు. పంత్ బ్యాటింగ్ మారడంతో అది బౌలర్లకు చాలెంజ్గా మారిందన్నాడు.
ఈ ఐపీఎల్ సీజన్లో పంత్ బ్యాటింగ్ ఆకర్షణీయంగా సాగుతోందని లారా పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్ షో మాట్లాడుతూ ‘ పంత్ అంతకముందు కొన్ని షాట్లు ఆడేవాడు కాదు. ఇప్పుడు అలా లేదు. గ్రౌండ్లో అన్ని వైపులా ఆడుతున్నాడు. ఇది వరకు లెగ్సైడ్ షాట్లనే పంత్ ఆడేవాడు. అది అతనికి శాపంగా మారింది. ఈ ఐపీఎల్లో ఆఫ్ సైడ్ షాట్ల కూడా బాగా ఆడుతున్నాడు. ఆన్సైడ్లో ఒకే రకమైన షాట్ల వల్ల ఉపయోగం లేదనే విషయాన్ని పంత్ గ్రహించాడు.
ఓవరాల్గా గతంలో పంత్ ఎక్కువ ఆడలేని ఎక్స్ట్రా కవర్, ఓవర్ పాయింట్, పాయింట్ ముందు షాట్లలో కూడా బాగా మెరుగయ్యాడు. ఇది అతని ‘ఆల్రౌండ్’ బ్యాటింగ్ కు బాగా ఉపయోగపడుతుంది. ఆ యువ క్రికెటర్ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’ అని తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్న పంత్ ఇప్పటివరకూ ఐదు గేమ్లు ఆడి 171 పరుగులు సాధించాడు. అతని స్టైక్రేట్ సుమారు 140.00గా ఉంది.