అమరావతి: బ్రిటన్ డిప్యూటీ హై కమీషనర్ ఇవాళ ఏపీ ముఖ్యమంత్రిని కలిసారు. ఏపీలో తాము ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్ వాహనాలు, వ్యవసాయ టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి పలు ముఖ్యమైన రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు బ్రిటన్ తెలిపింది.
భారత సీఐఐ తో పాటు ఇతర పారిశ్రామిక ప్రతినిధులు మరియు రాష్ట్ర అధికారులతో ఏపీలో పర్యటిస్తోన్న బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బృందం నిన్న సమావేశమైంది. కాగా ముఖ్య వ్యాపార రంగాలైన ఫార్మా, బయోటెక్, హెల్త్కేర్, లాజిస్టిక్ వంటి రంగాలలో పెట్టుబడులపై బ్రిటన్ బృందం ఆసక్తిని వ్యక్తం చేసినట్లు సీఐఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆండ్రూ ఫ్లెమింగ్తో ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సోమవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ యొక్క పనితీరు మరియు మహిళల సాధికారిత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఫ్లెమింగ్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కాజ గ్రామం జాతీయ రహదారి పక్కనే ఉన్న మురుగన్ హోటల్ను ఆండ్రూ ఫ్లెమింగ్ సందర్శించారు. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసేందుకు హోటల్కు వచ్చిన ఆయన ఆంధ్ర వంటకాలను చాలా ఇష్టంగా తిన్నారు. ఆంధ్ర భోజనం చాలా బాగుందని కూడా ఆయన కితాబిచ్చారు. అనంతరం ఆటోనగర్లోని ఏపీఐఐసీ భవనంలో అధికారులతో సమావేశమయ్యారు.