తెలంగాణ: ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించడమే నేరమా? – కేటీఆర్
తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ను సీసీఎస్ పోలీసులు విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఈ కేసులో దిలీప్ను సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు.
అయితే, ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించడమే కారణమై దిలీప్ను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ నేతలు, వారి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ అరెస్టును తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ మాట్లాడుతూ, ప్రజాపాలన అంటే ప్రశ్నించే వారి గొంతు నొక్కడమేనా? అని నిలదీశారు. ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఆగ్రహించారు.
ప్రభుత్వ అసమర్థతను దిలీప్ కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించటాన్ని రేవంత్ సర్కార్ తట్టుకోలేకపోయిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించగా, హైకోర్టు చీవాట్లు వేసినా ప్రభుత్వానికి ఎలాంటి బుద్ధి రాలేదని విమర్శించారు. మరోసారి దిలీప్ గొంతు నొక్కాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
కనీస సమాచారాన్ని కూడా ఇవ్వకుండా, ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారో తెలియకుండా అరెస్ట్ చేసినందుకు కేటీఆర్ మండిపడ్డారు. అక్రమ అరెస్ట్లు, నిర్బంధాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి సంఖ్య తగ్గదని, మరింతమంది ప్రశ్నించడానికి ముందుకు వస్తారని హెచ్చరించారు. దిలీప్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణలో వాక్ స్వాతంత్రం 9 నెలలుగా లేకుండా పోయిందని, నిరంకుశ పాలన సాగుతోందని విమర్శించారు.