న్యూఢిల్లీ: ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వం మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. దేశంలో కరోనా వల్ల చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించకుండా వారిపై చాలా క్రూరంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం విమర్శించారు.
చనిపోయిన ప్రజల ప్రాణాలకు విలువ కట్టడం అనేది అసాధ్యమని, అలాంటి వారికి ప్రభుత్వం ఇచ్చేది కొద్దిపాటి సాయం మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. అయితే మోదీ ప్రభుత్వం అటువంటి చిన్న సాయాన్ని చేయడానికి కూడా ఏ మాత్రం సిద్ధంగా లేదని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
కరోనా మహమ్మారి తీవ్రంగ ఉన్న సమయంలో మొదట సరైన వైద్యం కూడా అందించలేదని, ఆ తర్వాత ఇప్పుడు కరోనాపై తప్పుడు లెక్కలు చెబుతున్నారని, ప్రస్తుతం ప్రభుత్వం అత్యంత క్రూరత్వాన్ని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. దిగజారిన ఆర్థిక పరిస్థితుల రీత్యా కరోనాతో మరణించిన వారికి రూ. 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.