న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మాస్ వ్యాక్సినేషన్ ప్రారంభించింది. కాగా మే 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించాలని భావించినప్పటికి దేశంలో నెలకొన్న టీకాల కొరత వల్ల పలు రాష్ట్రాల్లో అది సాధ్యం కాలేదు.
ఈ సందర్భంలో వ్యాక్సిన్ ఉత్పత్తి వేగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కోవాగ్జిన్ కంపెనీ వ్యాక్సిన్ ఫార్ములాను మరికొన్ని కంపెనీలకు ఇవ్వడానికి కేంద్రం ఇవాళ అంగీకారం తెలిపింది. కోవాగ్జిన్ ఫార్ములా, టెక్నాలజీ బదిలీని ఇతర కంపెనీలకు ఇవ్వాలని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
భారత్ బయోటెక్ వారు తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు, టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని పలువురు కోరారు. ఇతర వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలకు టెక్నాలజీని అందించే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్రం సమయం తీసుకున్న మొత్తానికి సానుకూల నిర్ణయం తీసుకుంది. ఫలితంగా తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే అవకాశం కలుగుతుంది.