అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులకు శనివారం పెద్ద శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు సంబంధిత ఫైలుపై శనివారం ఆయన సంతకం కూడా చేశారని తెలిసింది.
రెండు మూడు రోజుల్లో బదిలీల అంశంపై ఉత్తర్వలు కూడా వెలువడనున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 29-2-2020 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ ఈ బదిలీలకు అర్హులు అవుతారు అని తెలిసింది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీలు కార్యక్రమం చేపట్టనున్నారు.
అయితే, టీచర్ల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మూడేళ్లుగా ఎదురు చూస్తున్న బదిలీల అంశంపై సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం తమకు చాలా సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్ రామ్ రెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్కు ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయులందరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు.