హైదరాబాద్: తెలంగాణలో మార్చి నెల నుంచి 50 ఏళ్లు పైబడిన, ఆ లోపు వయసుగల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కరోనా టీకా వేసేందుకు పేర్ల నమోదుపై చాలా గందరగోళం నెలకొంది. వారి పేర్లను కోవిన్ యాప్లో నమోదు చేసే ప్రక్రియ ఇప్పటి వరకు మొదలు కాక పోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
కోవిన్ యాప్లో పేర్లు నమోదు చేసుకున్న వారికే తొలుత టీకా వేస్తామని ప్రభుత్వం స్పష్టంగా చెప్పడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకా వేస్తున్నారు. త్వరలో రెండో డోసు కూడా మొదలవబోతోంది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే 50 ఏళ్లు పైబడిన, 50 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్ వేయనున్నారు.
రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మందికి మొదటి విడత టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించగా అందులో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది దాదాపు 3 లక్షల మందిని గుర్తించారు. ఇక పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఇతర ఫ్రంట్లైన్ కార్మికులు దాదాపు 2 లక్షల మంది ఉంటారు.
ఫ్రంట్ లైన్ వర్కర్లు కాక మిగిలిన వారంతా 50 ఏళ్లు పైబడిన వారు, ఆలోపు వయసుగల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు. అంటే 75 లక్షల మందికి వచ్చే నెల నుంచి టీకా వేయాల్సి ఉంది. కానీ వారి జాబితా తయారీపై ఇప్పటివరకు ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించలేదు. కోవిన్ యాప్లో పేర్లు ఎలా నమోదు చేయాలో మార్గదర్శకాలను కేంద్రం పంపించలేదు. వారిని గుర్తించడం అత్యంత సంక్లిష్టమైన వ్యవహారమని వైద్య, ఆరోగ్య వర్గాలు అంటున్నాయి. ఈ సమస్యలను అధిగమించి జాబితా ఎలా తయారు చేయాలో కూడా అధికారులకు స్పష్టత లేదు.