వాషింగ్టన్: సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ వాటి వల్ల కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. అభివృద్ది మోజులో పడి మన ముందు ఉన్న ప్రకృతిని పట్టించుకోవడం లేదు. పూడ్చలేని నష్టం వాటిల్లిన తర్వాత కళ్లు తెరిచి, పరిష్కారం గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతం ప్రపంచ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య కర్భన ఉద్గారాలకు సంభంధించినదిగా ఉంది.
ఇలా అభివృద్ధి పెరిగిన కొద్ది ఉద్గారాల శాతం మాత్రం ఎక్కువవుతున్నాయి. దాంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, అతివృష్టి, అనావృష్టి తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా అధినేత, బిలియనీర్ ఎలన్ మస్క్ ఓ కొత్త సవాల్ని తెర మీదకు తెచ్చారు. అంతే కాదండోయ్ గెలిచిన వారికి 100 మిలియన్ డాలర్ల(7,30,05,50,000 రూపాయలు) భారీ ప్రైజ్ మనీని కూడా ప్రకటించారు.
అసలు ఈ చాలెంజ్ ఏమిటంటే, కర్భన ఉద్గారాలను సంగ్రహించే అత్యుత్తమ సాంకేతికతను అభివృద్ధి చేయాలి. వాతావరణ మార్పులను అదుపులో ఉంచే అనేక ప్రణాళికలలో భూమిని వేడేక్కించే ఉద్గారాలను సంగ్రహించడం చాలా కీలకమైనదిగా మారుతోంది. కాని ఈ రోజు వరకు ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో వెనకబడే ఉన్నాం.
వాతావరణంలోని గాలి నుంచి కార్బన్ను బయటకు తీయడం కంటే ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలన్ మస్క్ తన ట్విట్టర్ వేదికగా, ‘‘కర్భన ఉద్గారాలను సంగ్రహించే అత్యుత్తమ సాంకేతికతను అభివృద్ధి చేసిన వారికి 100 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని అందిస్తాను అని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వచ్చే వారం ప్రకటిస్తాను’’ అంటూ ఆయన ఈ రోజు ట్వీట్ చేశారు.