అమరావతి: ఏపీలో రెండో దశ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ 20 నుంచి 26 తేదీల మధ్య వారం రోజుల పాటు జరిగిన 14 రకాల రాత పరీక్షల ఫలితాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విడుదల చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ కమిషనర్ గిరిజాశంకర్, మున్సిపల్ శాఖ కమిషనర్ విజయకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సారి పరీక్షలకు హాజరైన అభ్యర్థులందరికీ వారి మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటించారు. ఆ ర్యాంకుల ఆధారంగా, జిల్లాల వారీగా ఖాళీలను ఆయా జిల్లాల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో రిజర్వేషన్లు పాటిస్తూ మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
ఈ పరీక్షకు నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి రాష్ట్రంలో 16,208 పోస్టులు ఖాళీ ఉండగా, ఫలితాలు వెల్లడించే నాటికి ఆ సంఖ్య 18,048కి పెరిగింది. జిల్లాల్లో మెరిట్ లిస్ట్ నుంచి కేటగిరీ ఆధారంగా 18,048 పోస్టులనూ భర్తీ చేయనున్నారు.
ర్యాంకుల ఆధారంగా జిల్లాల్లో మరో వారం రోజుల్లో కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జిల్లాల్లో ఖాళీల భర్తీకి కలెక్టర్లు మెరిట్ లిస్ట్ ప్రకారం అర్హులైన అభ్యర్థులను రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ప్రకారం ఎంపిక చేసి ప్రొవిజనల్ సెలక్షన్ లెటర్స్ పంపుతారు. ఇన్సర్వీస్ అభ్యర్థులకు వారి సర్వీస్ను బట్టి గరిష్టంగా 15 మార్కులు కలిపి జాబితాలను రూపొందిస్తారు.
అనంతరం ప్రతి పోస్టుకూ క్వాలిఫైయింగ్ మార్కులను పోస్టుల లభ్యతను బట్టి కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా సెలక్షన్ కమిటీలు నిర్ణయిస్తాయి. ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ ప్రతులను వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తరువాత కలెక్టర్లు ప్రకటించే తేదీల్లో నిర్ణీత ప్రదేశాలకు వెళ్లి సర్టిఫికెట్లను తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుంది.
ప్రజా సంక్షేమం, అభివృద్ధితో పాటే నిరుద్యోగ యువతలో ఆశలు నింపుతూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.