fbpx
Tuesday, April 1, 2025
HomeBig Storyహైదరాబాద్ నగరంలో హైడ్రా సునామీ

హైదరాబాద్ నగరంలో హైడ్రా సునామీ

Hydra- Tsunami- in- Hyderabad- city

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) నిరంతరంగా కొనసాగుతుండగా, ఈ చర్యలు నగరంలో ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్), బఫర్ జోన్‌లో అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రజలు తమ నివాసాలపై దాడులు జరుగుతాయని భయాందోళన చెందుతుండగా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రజలను సమర్థవంతంగా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో చట్టపరమైన భద్రత:

ఇప్పటికే ఎఫ్‌టీఎల్ మరియు బఫర్ జోన్‌లో ఉన్న భవనాలను కూల్చబోమని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రధానంగా కొత్తగా నిర్మాణాలు చేపట్టినవి, నిర్మాణ దశలో ఉన్నవే కూల్చివేయబడతాయని వెల్లడించారు. మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణ దశలోనే ఉండడంతో వాటిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇక చట్టపరమైన అనుమతులు లేకుండా చెరువు బఫర్ జోన్‌లో చేపట్టిన భవన నిర్మాణాలపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

సున్నం చెరువులో కూల్చివేతలపై నిరసనలు:

సున్నం చెరువు పరిధిలో కూడా అక్రమ నిర్మాణాలపై దూకుడుగా కూల్చివేతలు జరుగుతున్నాయి. కొన్ని షెడ్లు బిజినెస్ పరంగా వినియోగిస్తుండగా, గతంలో వాటిని కూల్చివేసినప్పటికీ, వాటిని మళ్లీ నిర్మించడం వల్ల హైడ్రా అధికారులు మరల కూల్చివేత చర్యలకు పాల్పడ్డారు. ఈ చర్యలపై బాధితులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, కూల్చివేతల చర్యలను వ్యతిరేకిస్తున్నారు. బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా, మాజీ ఎమ్మెల్యే కాటసాని భూపాల్ రెడ్డిపై కూడా కేసులు నమోదు చేసినట్లు రంగనాథ్ తెలిపారు.

మాదాపూర్‌లో ఉద్రిక్త వాతావరణం:

మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ కట్టడాలను కూల్చివేయడంపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, అధికారులు వెనక్కి తగ్గకుండా చర్యలు కొనసాగించారు. భారీ మెషిన్లతో బహుళ అంతస్తుల భవనాలను కూల్చివేయడంతో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాధితులు మీడియా ముందు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, న్యాయసమాధానం కోసం కోర్టుకు వెళ్ళినా, హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చి కూడా ఆగకుండా కూల్చివేతలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు:

కూల్చివేతలలో భాగంగా ఒక మహిళ మీడియా ముందు కన్నీరు పెట్టుకుంటూ, కేసీఆర్‌ను పొగుడుతూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించింది. “కేసీఆర్ 28 రోజులు నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారు. ఆయన మహానుభావుడు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ప్రజల కడుపు కొట్టి, ఇళ్లను కూల్చడానికే వచ్చారా?” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి.

ఆత్మహత్యాయత్నం చేసిన బాధితులు:

కూల్చివేతలపై నిరసనగా ఐదుగురు బాధితులు కిరోసిన్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడానికి సిద్ధపడ్డారు. “మా ఇళ్లను కూల్చితే ఒంటికి నిప్పంటించుకుంటాం” అని బెదిరించారు. తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా ఈ చర్యలు చేపడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లు పాపలతో ఉన్న తమ కుటుంబాలు ఎక్కడికి వెళ్లాలని వారు ప్రశ్నించారు.

పర్మిషన్లు ఉన్నా కూల్చివేతలు:

కూల్చివేతలు జరిగిన చోట పర్మిషన్లు వచ్చిన తర్వాతే ఇళ్లు కట్టుకున్నామని, ఎంతో కష్టపడి నిర్మించిన ఇళ్లు కూల్చివేయకూడదని బాధితులు అధికారులను వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా హైడ్రా అధికారులను సామాన్యుల పైనే దాడి చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజకీయ నాయకులను, ధనవంతులను వదిలేసి పేదవాళ్ల పైనే హైడ్రా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

సామాన్య ప్రజలకు షాక్:

హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు సామాన్య ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చాయి. హైడ్రా అధికారులు మాత్రం అక్రమ నివాసాలు వాణిజ్యంగా వినియోగిస్తున్న వాటిపైనే చర్యలు తీసుకుంటున్నామని, కేవలం కొత్తగా నిర్మించిన, నిర్మాణ దశలో ఉన్న భవనాలపై మాత్రమే కూల్చివేస్తున్నామని చెబుతున్నారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం తమ కట్టడాలపై కూల్చివేతలతో నిలువ నీడ లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular