జెనీవా: భారత దేశంలో వెలుగు చూసిన కరోనా వైరస్ వేరియంట్ బి-1.617 రకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అత్యంత ఆందోళనకరమైన స్ట్రెయిన్గా వర్గీకరించింది. భారత్ లో కనుగొన్న స్ట్రెయిన్ పై తాము పరిశోధనలు చేస్తున్నామని, బి-1617 వ్యాప్తి గురించిన వివరాలు సేకరిస్తున్నట్లు ప్రకటించింది డబ్ల్యూహెచ్వో.
డబ్ల్యూహెచ్ఓ కోవిడ్-19 సాంకేతిక విభాగం చీఫ్ డాక్టర్ మారియా వాన్ కెర్కోవ్ సోమవారం మాట్లాడుతూ, ఇండియన్ వేరియంట్పై డబ్ల్యూహెచ్ఓ ల్యాబ్ టీం, ఎపీ టీం పరిశోధనలు చేస్తోందన్నారు. ఈ వైరస్ వేరియంట్ గురించి మాకు పూర్తి అవగాహన ఉంది. స్థానికంగా, ఇతర దేశాల్లో భారత స్ట్రెయిన్పై చేస్తున్న అధ్యయనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం అని తెలిపారు.
ఇప్పటి దాకా తమకున్న సమాచారం ప్రకారం ఈ వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగానే ఉంది. అందువల్ల దీనిని ఆందోళకరమైన వేరియంట్గా వర్గీకరిస్తున్నాం అని పేర్కొన్నారు. అలాగే ఈ వేరియంట్ గురించి మరింత సమాచారం సేకరించాల్సి ఉందన్నారు. ఈ వైరస్ వేరియంట్ యొక్క జన్యుక్రమాన్ని ఇంకా పూర్తిగా విశ్లేషించాల్సి ఉంది.
రాబోయే భవిష్యత్తు కాలంలో ఇంకా చాలా వేరియంట్లను చూడాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత మేరకు వైరస్ వ్యాప్తి అడ్డుకట్ట వేస్తూ, అది తీవ్రరూపం దాల్చకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా కూడా ఎవరికి వారు సురక్షితంగా ఉండేలా అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి, అని ఆమె పేర్కొన్నారు.