fbpx
Tuesday, April 15, 2025
HomeAndhra Pradeshకార్మికుల కోసం ముమ్మర ప్రయత్నాలు

కార్మికుల కోసం ముమ్మర ప్రయత్నాలు

Intensive efforts for workers

తెలంగాణ: సొరంగం లోపల నిర్బంధిత కార్మికుల కోసం ముమ్మర ప్రయత్నాలు

భారీ భూస్లైడ్ కారణంగా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావులు పలు సమీక్షలు నిర్వహించారు. సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ దళాల అధిపతులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమై, భూభాగంపై నుంచి రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించే అవకాశాలను పరిశీలించారు. భూభాగ నిర్మాణం, రక్షణ వ్యూహాలను అంచనా వేసేందుకు మ్యాప్‌లను అధ్యయనం చేశారు.

సైనిక బృందాల ముమ్మర చర్యలు

మంత్రి ఉత్తమ్‌ చొరవతో కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం నుంచి మూడు హెలికాప్టర్ల ద్వారా నేవీ సభ్యులను తరలించింది. సంఘటన స్థలాన్ని నావికాదళం ముందుగా గగనతలంలో నుంచి పరిశీలించింది. సోమవారం నుంచి ఈ బృందాలు రక్షణ చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొననున్నాయి. సింగరేణి విపత్తు నిర్వహణ బృందం కూడా ప్రత్యేక పరికరాలతో సహాయ చర్యల్లో నిమగ్నమైంది. మొత్తం 130 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్‌, 120 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్‌, 24 మంది ఆర్మీ, 24 మంది సింగరేణి రెస్క్యూ టీం, 24 మంది హైడ్రా సభ్యులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

టన్నెల్‌లో కుంగిన యంత్రం – ఆపరేషన్‌లో అడ్డంకులు

ఆదివారం, ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సభ్యులతో కూడిన బృందం టన్నెల్‌లోకి ప్రవేశించింది. ఐదుగురు ఆర్మీ, 15 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ అజయ్‌కుమార్‌, జయప్రకాశ్‌ అసోసియేట్స్‌ ప్రతినిధులు లోపలికి వెళ్లారు. టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM) కు కొద్ది దూరం ముందు వ్యాగన్లు వెళ్లలేని స్థితి ఏర్పడింది. కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా కొన్ని ప్రాంతాలకు చేరుకున్నా, అక్కడ భారీగా పేరుకుపోయిన బురద, నీటి కారణంగా ఆపరేషన్‌ కష్టతరమైంది. TBM పై అంతస్తు పూర్తిగా కిందకు కుంగిపోయిందని, నీరు, బురద తొలగించిన తర్వాతే కార్మికుల జాడ తెలియొచ్చని అధికారులు తెలిపారు.

భారత సైన్యం కీలక పాత్ర

సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజినీర్ టాస్క్‌ఫోర్స్‌ (ETF) బృందం అధిక సామర్థ్యం కలిగిన పంపింగ్‌ సెట్లు, పైపులు, జేసీబీలు, బుల్డోజర్లతో సహాయ చర్యలను వేగవంతం చేస్తోంది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, టన్నెల్‌ గుత్తేదార్లతో సమన్వయం చేస్తూ నిరంతరాయంగా రక్షణ చర్యలను చేపడుతోంది.

స్క్యూ ఆపరేషన్‌ – మట్టిని తొలగించేందుకు ప్రయత్నాలు

శనివారం రాత్రి 10:30 గంటలకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది 8 మంది రైలు ద్వారా టన్నెల్ లోపలికి వెళ్లారు. 12 కిలోమీటర్ల ప్రయాణం అనంతరం కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా మరో కిలోమీటర్‌ ముందుకు సాగారు. దాదాపు 300–400 మీటర్ల దూరం వరకు మట్టి, ఐరన్‌ షీట్స్‌, టన్నెల్‌ సామగ్రి పేరుకుపోయినట్లు గుర్తించారు. రాత్రి 2:30 గంటలకు తిరిగి వచ్చారు.

అర్ధరాత్రి 3 గంటలకు 23 మంది సభ్యుల బృందం టన్నెల్‌లోకి వెళ్లింది. వారు 300-400 మీటర్ల దూరం వరకు వెళ్లగలిగారు. అక్కడ 2.5 మీటర్ల ఎత్తు వరకు బురద ఉండటంతో నడవడం అసాధ్యమైంది. మూడు రోజుల పాటు 24 గంటలు షిప్టులవారీగా సహాయ చర్యలు కొనసాగితేనే లోపల ఉన్న కార్మికుల్ని రక్షించగలమన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు బృందం తిరిగి వచ్చింది.

అధికారుల సమీక్షలు, భవిష్యత్‌ ప్రణాళికలు

ఉదయం 10 గంటలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి జేపీ గెస్ట్‌హౌస్‌కు చేరుకొని అధికారులతో సమీక్ష నిర్వహించారు. 10:30 గంటలకు ఆర్మీతో సహా ఇతర సహాయక బృందాలు టన్నెల్‌లోకి ప్రవేశించాయి. 11:30 గంటల వరకు మంత్రులు, ఇతర అధికారులు టన్నెల్ ప్రాంతాన్ని పరిశీలించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టన్నెల్ లోపల అర కిలోమీటర్‌ మేర నడిచి పరిశీలించారు. మధ్యాహ్నం 1 గంటకు మరో బృందం లోపలికి వెళ్లగా, అందులో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు.

సాయంత్రం 5:30 గంటలకు రాబిన్‌ కంపెనీకి చెందిన 10 మంది టన్నెల్‌ నుంచి తిరిగి వచ్చారు. 6:40 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు టన్నెల్‌ నుంచి బయటకు వచ్చారు. ఈ ఆపరేషన్‌ విజయవంతం కావాలంటే, మరింత సమర్థవంతమైన వ్యూహంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular