కోల్కతా: ఇంకొన్ని గంటల్లో ఐపీఎల్ 18వ సీజన్కు రంగప్రవేశం కానుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్తో ఈసారి టోర్నీ మొదలవుతోంది. బీసీసీఐ ఈ సీజన్ కోసం మూడు కీలక నియమాల్లో మార్పులు చేసింది.
మొదటి మార్పు – లాలాజల నిషేధం ఎత్తివేత. కోవిడ్ సమయంలో బంతిపై లాలాజలాన్ని వాడకూడదన్న నిబంధనను ఈ సీజన్ నుంచి ఎత్తేశారు. కెప్టెన్ల భేటీలో మెజారిటీ అభిప్రాయంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బౌలర్లు మళ్లీ బంతిని మెరిపించడానికి లాలాజలాన్ని ఉపయోగించవచ్చు.
రెండో మార్పు – రెండో ఇన్నింగ్స్లో కొత్త బంతి. సాయంత్రం మ్యాచ్లలో, 11వ ఓవర్ తర్వాత మంచు ప్రభావం ఉంటే అంపైర్ల ఆమోదంతో కొత్త బంతిని ప్రవేశపెట్టనున్నారు. ఇది మధ్యాహ్నం మ్యాచ్లకు వర్తించదు.
మూడో మార్పు – వైడ్ బాల్స్కి డీఆర్ఎస్. తొలిసారి హైట్ వైడ్స్ మరియు ఆఫ్-సైడ్ వైడ్స్కు డెసిషన్ రివ్యూ సిస్టమ్ను అనుమతించారు. లెగ్-సైడ్ వైడ్స్ మాత్రం ఎప్పటిలాగే అంపైర్ నిర్ణయానికే పరిమితమవుతాయి.
ఇక గతేడాది ప్రారంభించిన ఇంపాక్ట్ ప్లేయర్ నియమాన్ని ఈసారి కూడా కొనసాగిస్తున్నారు. ఈ నియమం క్రితం సీజన్లో విమర్శలు ఎదుర్కొన్నా, బోర్డు దీనిని కొనసాగించడంపై మొగ్గు చూపింది.